గుంటూరు ఎంపీ గల్లా వైసీపీలోకి?

ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరగా తాజాగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సైతం వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. 2014, 2019 లలో రెండు సార్లు గుంటూరు నుండి ఎంపీగా గెలిచిన గల్లా ఈ సారి తెలుగుదేశం నుండి పోటీకి విముఖత చూపిస్తున్నారు.

అయితే ఈసారి గల్లా పోటీ చేయరని భావిస్తున్న తరుణంలో వైసీపీ సీనియర్ నేత, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ కి అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి. ప్రస్తుతం రాజకీయ పరిణామాలు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో సాగుతున్న తరుణంలో గల్లా – చెవిరెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

త్వరలోనే సీఎం జగన్‌తో గల్లా భేటీ అవుతారని వైసీపీలో చేరినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని ప్రచారం జరుగుతోంది. వైసీపీ నుండి గుంటూరు సీటు ఇస్తారని టాక్ నడుస్తోంది. సంక్రాంతి సెలవుల తర్వాత తన అనుచరగణంతో సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. మరి గల్లా నిజంగా వైసీపీలో చేరుతారా..? లేదా..? అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.

ఒకవేళ గల్లా వైసీపీలో చేరితే అతని బిజినెస్ ని అధికారవైసీపీ పార్టీ నాశనం చేసింది కంపెనీని తెలంగాణ తరలించేలా చేసింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ ఇంకా ఒక వర్గం మీడియా దీనిని ఎలా స్వాగతిస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది!

Leave a Comment