టీవీ5 సాంబశివరావు కుటుంబ సభ్యులపై కేసు నమోదు

నిత్యం టీవీ5 వేదికగా ప్రవచనాలు వల్లించే సాంబశివరావు కుటుంబ సభ్యుల పైన కేసు నమోదైంది. భూ వ్యవహారంలో తమను మోసం చేసారంటూ హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. సాంబశివరావు పెట్రోల్ బంకుల వ్యాపారం నిర్వహిస్తారు. హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ పెట్రోల్ బంకు నిర్వహణకు స్థలం లీజుకు ఇచ్చిన వ్యవహారంలో ఆయన కుటుంబం పైన ఫిర్యాదు దాఖలైంది. హిందూస్థాన్ పెట్రోలియం కు తాము సంతకాలు చేయకుండానే తమ సంతకాలతో లీజు డాక్యుమెంట్లు రావటం పైన ఈ ఫిర్యాదు నమోదు చేసారు.

భూమి వ్యవహారంలో ఛీట్ చేసారని ఫిర్యాదులు

నిత్యం టీవీ 5 ద్వారా జగన్ ప్రభుత్వం పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సాంబ కుటుంబ సభ్యులు తమను మోసం చేసారంటూ బాధితులు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. శేరిలింగంపల్లి ప్రాంతంలో 600 చదరపు మీటర్ల స్థలం విషయంలో ఈ వివాదం నెలకొంది. పెట్రోల్ బంక్ కోసం ఈ స్థలం కూడా కలిపి సాంబ కుటుంబ సభ్యులు హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ తో లీజ్ కు ఇచ్చినట్లుగా ఒప్పందం చేసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీని పైన తాము సాంబ కుటుంబ సభ్యులను ప్రశ్నించగా అక్కడ ఉన్న పెట్రోల్ బంక్ ను వారి పేరు మదకే బదిలీ చేస్తామని నమ్మించారని చెబుతున్నారు. ఎంత కాలం అయినా చెప్పిన విధంగా చేయకపోవటంతో అనుమానం వచ్చిన ఫిర్యాదు దారులు హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ అధికారులను కలిసారు.

అక్కడ తమకు ప్రమేయం లేకుండానే తాము హెచ్పీసీఎల్ కు తమ స్థలం లీజుకు ఇచ్చినట్లుగా సంతకాలు చేసినట్లు గుర్తించారు. దీంతో కంపెనీతో బాధితులు అసలు విషయాన్ని మొర పెట్టుకున్నారు. మూడేళ్లుగా లీజు ఎరియర్స్ చెల్లించేందుకు కంపెనీ అధికారులు ముందుకు వచ్చినట్లు సమాచారం. కానీ, స్థలం విషయంలో జరిగిన వ్యవహారాల పైన నిలదీస్తే తమను బెదిరిస్తున్నారంటూ బాధితులు మాదాపూర్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. దీంతో, ఫిర్యాదు ఆధారంగా మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసారు. దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Leave a Comment